ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు యథాతథం

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు యథాతథం

ఆంధ్రప్రదేశ్ లో ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయన్నారు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. కరోనాపై సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపారని చెప్పారు. సమీక్ష తర్వాత మాట్లాడిన మంత్రి.. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 24కి పూర్తవుతున్నాయని, ఆపై థియరీ పరీక్షలు మే 5 నుంచి 23 వరకు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వివరించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అయితే..1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి(మంగళవారం) నుంచి సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ అకాడమిక్ ఇయర్ పూర్తయిందని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఇప్పటివరకు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించామని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేశ్. కరోనా నిబంధనలు పూర్తిస్థాయిలో పాటిస్తూనే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుపుతామన్నారు.